కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు.. దారి ఇవ్వాలని కోరిన చంద్రబాబు

  • చిలకలూరిపేటలో చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్‌ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
  • దాదాపు అరగంట పాటు నిలిచిన కాన్వాయ్
  • రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు
  • దారి ఇవ్వాలని అధినేత కోరడంతో ముందుకు కదిలిన వాహనం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును తీసుకు వెళ్తున్న కాన్వాయ్‌ని టీడీపీ శ్రేణులు చిలకలూరిపేటలో అడ్డుకున్నాయి. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో మహిళలు సహా వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై కూర్చున్నారు. దీంతో చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ ఇక్కడ దాదాపు అరగంటపాటు నిలిచిపోయింది. టీడీపీ శ్రేణులను పక్కకు తప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. కానీ వారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత వాహనం నుండి దిగి దారి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు నిరసనను ఆపలేదు. చంద్రబాబు ఒకటికి రెండుసార్లు దారి ఇవ్వాలని కోరడంతో తప్పుకున్నారు. దీంతో కాన్వాయ్ ముందుకు కదిలింది. కాన్వాయ్‌ని ఎక్కడికి అక్కడ టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, టీడీపీ కార్యకర్తలపై, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

Chandrababu
Police
Andhra Pradesh
Telugudesam

More Telugu News